లాలూ ప్రసాద్ యాదవ్ను మూడేన్నరేళ్లు జైలు శిక్ష

పశుదాణా కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా గత డిసెంబర్ 23న నిర్ధారించిన రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారంనాడు ఆయనకు శిక్ష ఖరారు చేసింది. లాలూకు మూడేన్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలుశిక్ష పొడిగిస్తామని తెలిపింది. లాలూతో పాటు కేసులో దోషులుగా నిర్ధారించిన ఫూల్ చంద్, మహేష్ ప్రసాద్, బకె జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారాంలకు కూడా కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల చొప్పున జరిమానాను ప్రత్యేక కోర్టు విధించింది.
రెండు సార్లు ఇప్పటికే శిక్షల తీర్పు వాయిదా వేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్ సింగ్ శనివారం తుది తీర్పు చెప్పారు. దోషిగా నిర్ధారణ జరిగిన తర్వాత బిర్సాముండా సెంట్రల్ జైలుకు వెళ్లిన లాలూ తీర్పు సందర్భంగా జస్టిస్ శివపాల్ సింగ్ ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అనారోగ్యం, వయోభారం కారణంగా శిక్షలు తగ్గించాలనంటూ లాలూ ప్రసాద్ శుక్రవారంనాడు కోర్టుకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారు.
1990 నుంచి 94 మధ్య బీహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు పశువుల దాణా విషయంలో దేవ్గఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షల కుంభకోణానికి పాల్పడారన్న అభియోగం నిర్ధారణ అయింది. కాగా, ఆర్జీడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మెడకు మరో దాణా కేసు కూడా చుట్టుకుని ఉంది. దాణా కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచి లాలూ ఇంతవరకూ 375 రోజులు జైలులో గడిపారు.
హైకోర్టులో సవాలు
కాగా, లాలూకు ముడున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్టు లాలూ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
Leave a Reply